Monday, July 19, 2010

సినీపరిశ్రమ

పైరసీ

సినిమాలు తియ్యడం దగ్గరనించి, ప్రజలకి వాటిని చూపించి, డబ్బులు చేసుకోవడం వరకూ 'పరిశ్రమ' అని వొప్పుకుంటే, మిగిలిన భాషల సినిమాల మాట నాకు తెలియదు గానీ, తెలుగు సినిమాలకు ఇది వర్తిస్తుందా అని నాకు సందేహం.

ఈ విషయాన్ని బాబూ మోహన్, మోహన్ బాబు లాంటివాళ్ళు చక్కగా చెప్పగలరు.

కావేరీ జలాల గురించి తమిళ సినీ పరిశ్రమ అంతా కదిలి వెళ్ళింది.

కర్ణాటక లో, ఖచ్చితం గా కన్నడ సినిమాలే ప్రదర్శించాలనీ, యెక్కడైనా ఖాళీ వుంటేనే మిగిలిన భాషా చిత్రాలు ప్రదర్శించుకోవచ్చనీ, కట్టడి చేసి, అమలు చేస్తున్నారు.

మళయాళం గురించి నాకు తెలియదు. యెందుకంటే, ఈ భాషల వాళ్ళు తమ చిత్రాలని అక్కడ విడుదల చేసి ప్రదర్శించగలరనుకోను.

ఇక పైరసీ విషయానికి వస్తే, అది 'ఆర్గనైజ్డ్ క్రైమ్' అని వొప్పుకోవాలి. గొప్ప గొప్ప దేశ ప్రభుత్వాలే మాఫియా లాంటివాటినీ, డ్రగ్స్ నీ యేమీ చెయ్యలేకపోతున్నారంటే, మన ప్రభుత్వాల సంగతి చెప్పఖ్ఖర్లేదు.

ఇక వందల కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న పెద్ద హీరోల సినిమాలు పైరసీ వల్ల యెక్కువ నష్టపోతున్నాయి అని కొంతమంది బాధ పడుతున్నారు.

నిజమే--కానీ వాళ్ళు చేసేదీ వ్యాపారమే కదా? పెద్ద హీరోల సినిమాలకి పబ్లిసిటీకి, ప్రమోస్ కి, జనాల్లో ఎక్స్ పెక్టేషన్ లని పెంచడానికి యంత ఖర్చు పెడుతున్నారో అందరూ వూహించగలరు. ఇదే వాళ్ళ కొంప ముంచుతోంది.

విడుదలయిన రోజో, ఆ మర్నాడో తమ అభిమాన హీరో సినిమాని కేవలం "పది రూపాయల" ఖర్చు తోనే చూడగలుగుతున్నారు. అందుకే వాటికోసం యెగబడుతున్నారు--వందలు ఖర్చుపెట్టి థియేటరుకి వెళ్ళి చూడలేని సామాన్యులు.

చిన్న బడ్జెట్ సినిమాలకి సీడీలు వెంటనే విడుదల అవకపోయినా యేమీ ఫరవాలేదు--దొరికినప్పుడే చూస్తారు--లేదా, టీవీలూ, కేబుల్ టీవీలూ వుండనే వున్నాయి--పదిరూపాయల ఖర్చు కూడా లేకుండా చూడవచ్చు.

ఆ మధ్య టీవీల్లో కథనాలు వచ్చాయి పైరసీ యెలా జరుగుతోంది? అనే విషయం లో--కొంతవరకూ అన్నీ నిజాలే.

సినిమా టైటిల్, దాని డిజైన్ ఖరారవ్వగానే, అది పైరసీవాళ్ళకి చేరి పోతోంది. స్టిల్ ఫోటోలు పబ్లిసిటీ కోసం తియ్యబడగానే, అవి పైరసీవాళ్ళకి చేరుతున్నాయి. ఇక వాళ్ళు సీడీల కవర్ డిజైన్లని రూపొందించుకొని, ప్రింటు చేసేసి, సిధ్ధం గా వుంటున్నారు.

సినిమా విడుదల అయి, మొదటి ఆట ప్రదర్శించబడగానే, ఓ గంటలోపే సినిమా వీడియో మొత్తం కంప్యూటర్లో అప్ లోడ్ అయిపోయి, వెంటనే 50 నించి 80 వేల సీడీలు తయారయ్యి, మర్నాడు పొద్దున్నకల్లా, మన నగరాలూ పట్టణాల్లోని షాపులకీ, లైబ్రరీలకీ చేరుతున్నాయి.

ఈ అప్ లోడ్ అయిన సినిమాలని సీడీల్లో కాపీ చెయ్యడం అనేది చెన్నై, బెంగుళూరుల్లో జరుగుతున్నాయేమోనని టీవీవాళ్ళ సందేహం.

అంత ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న వ్యవహారాన్ని అరికట్టడం ప్రభుత్వం చేతుల్లో వుందా?

కొంతమంది, ఫలానా సినిమా పైరసీ సీడీలు మార్కెట్లోకి రాకుండా జాగ్రత్త పడ్డారు--మిగిలిన వాళ్లు కూడా ఆ రహస్యం తెలుసుకోండి--అని అంటున్నారు.

పబ్లిసిటీకి కొన్ని కోట్లు ఖర్చుపెట్టగలిగినవాళ్ళకి, హైదరాబాదు, విజయవాడల్లో, మిగిలిన పెద్ద పట్టణాల్లో యే థియేటరు నించి విడియో తియ్యబడుతోందో నిఘా పెట్టడం ఓ లెఖ్ఖా? (కానీ ఈ పని జరగడం లేదు--యెందుకో వూహించండి)

ఇక మహేష్ బాబులూ, పవన్ కల్యాణ్ లూ--నిజజీవిత హీరోలుగామారినట్టు నటించి, అభిమానులని వెంటేసుకెళ్ళి, షాపులని ధ్వంసం చెయ్యడం, వాళ్ళని చితక తన్నడం అనేవి కూడా పబ్లిసిటీ స్టంట్లే అని తెలియడం లేదూ?

అప్పుడప్పుడూ ముఖ్య మంత్రి కి విన్నపాలు ఇవ్వడం, సభల్లో మొసలి కన్నీళ్ళు కార్చడం, కొంతమంది చేత పైరసీ సీడీలు చూడడానికి వ్యతిరేకం గా స్టేట్ మెంట్లు ఇప్పించడం లాంటి పనులు చేస్తూ జీవిస్తున్నారు పరిశ్రమ పెద్దలు.

ఇదంతా అర్థం కాని కొందరు పినాకొ లు--ఈ విషయం పై వ్యాఖ్యానించేవాళ్ళమీద అడ్డం గా విరుచుకు పడుతున్నారు. వీళ్ళు తెలుసుకోవలసిన విషయం యేమిటి అంటే, వీళ్ళెంతగా విరుచుకుపడతారో, అంత పొడుగ్గానూ వాళ్ళ ముక్కు పెరిగి పోతుందని.

సినీపారిశ్రామికులూ, బ్లాగరులూ, సర్వేజనాస్సుఖినో భవంతు!       

Wednesday, July 7, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

తుమ్మల కిశోర్ కి యిప్పుడు వెలుగుతున్నట్టుంది--మొన్న "ఇన్నాళ్ళూ పీ ఎల్ ఆర్ మైనస్ 'ఇంత' పర్సెంట్" అని వ్యవహరించేవి బ్యాంకులు. ఇప్పుడు బేస్ రేట్ ప్లస్ 'ఇంత' పర్సెంట్ అని అంటాయి తప్పితే, పెద్ద మార్పేమీ వుండదు" అన్నట్టు వ్రాశాడు.

ఇది వరకు పీ ఎల్ ఆర్ కన్నా తక్కువకి ఋణాలిచ్చే బ్యాంకులు, ఇప్పుడు బేస్ రేట్ కన్నా తక్కువకి ఇవ్వలేవు--అని కూడా వ్రాశాడు.

(ఈ పీ ఎల్ ఆర్ విషయం లో బ్యాంకులు యెన్ని వెరయిటీలు ప్రవేశ పెట్టాయో ఇదివరకు టపాల్లో వ్రాశాను.)

మరదే--నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్ర చెయ్యి పెడతాను--అంటే!

దాదాపు 130 యేళ్ళక్రితం బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన "నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్స్ ఆక్ట్" క్రింద పనిచేసేవి మన దేశం లోని బ్యాంకులు. (ఇప్పుడా చట్టం ఒక్క విషయం లోనే--బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవలు ప్రకటించడానికే--వుపయోగిస్తోంది! బ్యాంకులే కాదు, బ్యాంకింగ్ ఆంబుడ్స్ మన్ సహితం ఈ చట్టాన్ని తుంగలో తొక్కేశారు ఇప్పుడు!)

ప్రామిసరీ నోట్ (ప్రో నోటు); చెక్కు; బిల్ ఆఫ్ ఎక్స్ ఛేంజ్--ఇవీ నెగోషియబుల్ ఇన్స్ ట్రుమెంట్ లు అంటే.

ప్రామిసరీ నోట్ అంటే బ్యాంకులు స్వల్పకాల ఋణాలు ఇవ్వడానికి వ్రాయించుకొనేవి--ఇవి 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతాయి--యెవరు వ్రాసినా, యెవరు వ్రాయించుకున్నా.

చెక్కు అంటే--మనం బ్యాంకులో దాచుకున్న డబ్బుని మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వమని బ్యాంకుకి జారీచేసే అధికార పత్రం. దీని విషయం లో లక్షా తొంభై రూల్సు అవసరమయ్యాయి కాల క్రమం లో. కొన్ని లక్షల కేసులు నమోదు చెయ్యబడేవి, బడుతూనే వున్నాయి ఇప్పుడు కూడా.

ఇక, బిల్ ఆఫ్ ఎక్స్ఛేంజ్ అంటే, ప్రో నోటు కి వ్యతిరేకం--నువ్వు నాకు నేనడిగినప్పుడు లేదా ఫలానా తారీఖు కి ఇంత డబ్బు ఇవ్వాలి అని వ్రాసేవి. వీటిలో 'సైట్' బిల్లులు అంటే, దాన్ని యెవరిని వుద్దేశించి వ్రాయబడిందో వాళ్ళు 'అంగీకారం' తెలపాలి. దీనికి బ్యాంకులు మీడియేటర్లుగా వుండేవి. సైట్ అంటే, "నువ్వు అంగీకరించిన తరవాత ఇన్ని రోజులకి/నెలలకి ఆ డబ్బు నాకుగానీ, నా ఆర్డరు పొందినవారికి గానీ చెల్లించాలి" అని వ్రాసేవి. 

ఇక్కడ ఆ చట్టం అవసరం వచ్చేది--డ్యూ డేట్ (చెల్లించవలసిన తేదీ) యేది--అనే విషయం లో. సామాన్యం గా చట్టం ప్రకారం, అంగీకారం అయిన తరవాత, యెన్నిరోజులు/నెలలు అయితే అన్నీ లెఖ్ఖపెట్టి, దానికి మూడు రోజులు 'గ్రేస్' (వుదారం గా) కలిపి, డ్యూ డేట్ నిర్ణయించాలి. ఒకవేళ, ఆ తేదీ గనక బ్యాంకుకి సెలవు అయితే, "అంతకు ముందు బ్యాంకు పనిచేసే రోజే" చెల్లింపు తేదీ గా మారుతుందన్నమాట!

అందుకనే, ఈ చట్టం క్రిందే, బ్యాంకులకి సెలవలు ప్రకటిస్తారు.

ఇలా "అంగీకృతమైన" బిల్లులని, బ్యాంకులు 10 శాతమో యెంతో తాము 'డిస్కవుంట్' గా స్వీకరించి, మిగిలిన సొమ్ము వ్రాసినవాడికి చెల్లించేసేవి--తాము డ్యూ డేట్ నాడు పూర్తి మొత్తం వసూలు చేసుకొనేవి.

బ్యాంకుకి అత్యవసరం అయితే, అలా తాము డిస్కవుంట్ చేసుకున్న బిల్లుల మొత్తం విలువని, రిజర్వ్ బ్యాంకు దగ్గర తనఖా పెట్టి, వడ్డీకి పైకం పొందేవి. అలా రిజర్వ్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రేటునే "బ్యాంక్ రేట్" అనేవారు.  

రిజర్వ్ బ్యాంకు యెప్పటికప్పుడు తన "బ్యాంక్ రేటు" ని ప్రకటించేది. మార్చాల్సి వస్తే, ఫలానా తేదీ నించి నా బ్యాంక్ రేట్ ఇంత--అని ప్రకటించేది. 

అందుకనే, బ్యాంకులు తమ వడ్డీ రేట్లకి ఆధారం గా ఈ బ్యాంక్ రేట్ ని స్వీకరించేవి--ప్రభుత్వమైనా, కోర్టులైనా, ప్రజలైనా ఇదే రేటుకి కట్టుబడేవారు--అదీ ఆ రేటుకున్న "పావిత్ర్యం" (Sanctity)!

--మిగతా మరోసారి.

Thursday, July 1, 2010

వడ్డీ రేట్లు

బేస్ రేట్

"నీ యెడం చెయ్యి తియ్యి, నా పుర్రచెయ్యి పెడతాను" అన్నాట్ట వెనకటికెవడో!

అలా వుంది మన బ్యాంకుల వ్యవహారం.

సంస్కరణలకి పూర్వం, రిజర్వ్ బ్యాంక్ మన బ్యాంకుల వడ్డీ రేట్లని నియంత్రించేది. 

"బ్యాంక్ రేట్" (రిజర్వ్ బ్యాంక్ రీడిస్కౌంట్ రేట్) ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. బ్యాంకులు 'బ్యాంక్ రేట్ కన్నా ఇంత శాతం అధికం' అని చెప్పి, అంతా వసూలు చేసేవి--ఋణాలపై.

(రిజర్వ్ బ్యాంక్ రీ డిస్కౌంట్ రేట్ గురించి నా ఇదివరకటి టపాలు చూడండి)

సంస్కరణల పుణ్యమా అని, బ్యాంక్ రేట్ రద్దు చెయ్యబడింది--బ్యాంకులనే వాటి ప్రథాన వడ్డీ రేట్లు (ప్రైమ్ లెండింగు రేట్లు) నిర్ధారించుకోమని స్వేఛ్ఛ ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్.

(ఇదే పుణ్యం గా ఇంకా చాలా స్వేఛ్ఛలని ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్. వుదాహరణకి, కొత్త బ్రాంచీలు తెరవడానికి తన 'లైసెన్స్' అక్కర్లేదనీ, ఇంతకు ముందు వున్నట్టు 'సర్వీస్ యేరియా'ల లోనే అప్పులు ఇవ్వఖ్ఖర్లేదు, దేశం మొత్తం మీద యెక్కడైనా ఇవ్వచ్చు--ఇలాంటివి! కానీ మన బానిస బుధ్ధి బ్యాంకులు ఒక్క అప్పులు ఇవ్వడం విషయం లోనే పాటించాయి--దాంతో ఎన్ పీ యే లు పెరిగిపోయి, దివాళా స్థితికి వచ్చాయి--అది వేరే సంగతి)

బ్యాంక్ రేట్ అంటే, ఫలానా తేదీ నించీ ఇంత అని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించేది. కాబట్టి అందరికీ ఆ రేటు తెలుసు--కోర్టులకి కూడా!

కానీ, పి ఎల్ ఆర్ కి వున్న 'పావిత్ర్యం' యేమిటి? యేయే రోజున యేయే బ్యాంక్ పి ఎల్ ఆర్ యెంత వుంది అన్నది యెవరికీ తెలియదు కదా? (తెలివైన లాయరు యెవరైనా బ్యాంకుల ప్రో నోట్లని కోర్టులో సవాలు చేస్తూ, ఫలానా రోజున మీ పి ఎల్ ఆర్ యెంతా? అది యెప్పుడెప్పుడు యెంతెంత మారిందీ, ఆ లెఖ్ఖన నా క్లయింట్ కట్టవలసిన బాకీ యెంత? అని అడిగితే, బ్యాంకులే తెల్లమొగం వెయ్యవలసిన పరిస్థితి!)

(పీ ఎల్ ఆర్ లలో యెన్ని వెరైటీలు కనిపెట్టారో కూడా నా పాత టపాలు చదివి తెలుసుకోండి)

సరే--అయిపోయింది. 

మరిప్పుడు, పీ ఎల్ ఆర్ స్థానం లో 'బేస్ రేట్' అని పెట్టి, దాన్ని 'శాస్త్రీయం గా' బ్యాంకులు నిర్ణయించుకోమంటే మాత్రం, దాని 'పావిత్ర్యం' యేమి వుంటుంది?

దీని మీద సో కాల్డ్ బ్యాంకింగ్ నిపుణుల వూహాగానాలు--ఋణాలు యెవరికి తక్కువ వడ్డీ కి అందుతాయి, యెవరికి పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థమీద వాటి ప్రభావం, 'టీజర్ రేట్లు' (ఇదో రకం వెర్రి) కొనసాగుతాయా లేదా?--ఇలా!

చెరువులో గేదెని ముంచి, కొమ్ములుచూసి బేరం చేస్తున్నట్టు లేదూ?