Monday, August 10, 2009

గోముఖమూ...గోదావరీ...గోష్పాదమూ

గోదావరి
పాపికొండల్లోని గురవాడ రిజర్వాయరు యెంత యెత్తులో వుందో తెలుసా? సాక్షాత్తూ సముద్ర మట్టం నించి 765 మీటర్లు (ట)! (అంటే 2,500 అడుగులకు పైగా!)
గోదావరి గురించీ, పాపి కొండల గురించీ, పట్టి సీమ గురించీ ఓ ఇతిహాసం ప్రాచుర్యం లో వుంది.
గౌతమ మహర్షి కొవ్వూరు (గోవూరే కొవ్వూరుగా మారిందట) దగ్గర వున్న ‘గోష్పాద క్షేత్రం’ లో ఆశ్రమం కట్టుకొని, తపో సాధన చేస్తూ వుండేవాడట!
ఆయన రోజూ వుదయమే సంధ్యావందనం పూర్తయ్యాక, కమండలం లోని నీళ్ళలో తడిపి, ఓ గుప్పెడు ‘అక్షతల’ని ఆశ్రమం పక్కనే చల్లుకొని, తపస్సాధనలోకి వెళ్ళిపోయేవాడట!
మధ్యాన్నం అయ్యేసరికి, చక్కగా ఆయనకి సరిపడా వరి ధాన్యం పండేవట! వచ్చే బియ్యం తో భోజనం కానిచ్చేవాడట!
ఆరోజుల్లో ఆ ప్రాంతమంతా దట్టమైన అడవిగా వుండడంతో, ప్రజలకి పంటలు పండించుకోడానికి జలవనరేమీ లేక, వాళ్ళు కొంతమంది మునులనీ వాళ్ళనీ ఆశ్రయించి, పరిష్కారమయ్యేలా ప్రార్థించారట! వాళ్ళు ఆ కోరికతో ఇంద్రుడి శరణుజొచ్చారట! ఆయన హామీ ఇచ్చేశాడు!
ఓ రోజున మధ్యాహ్నం గౌతముడు కళ్ళు తెరిచేసరికి ఓ గోవు (ఇంద్రుడు) ఆయన వరికంకులని భోంచేస్తోందట! పాపం గౌతముడు చేతికందిన ‘తృణాన్ని’ దాన్ని అదిలించడానికి విసిరితే, ఆ గోవు అమాంతం చచ్చిపడిపోయిందట!
గౌతముడు ఖిన్నుడై, గోహత్యా పాతకం నించి యెలా విముక్తుడవ్వాలని ఆలోచిస్తూంటే, మునులందరూ ‘దక్షిణ గంగ’ ని తీసుకొచ్చి, ఆ గోవుని తడిపితే, అది పునర్జీవితమవుతుంది అని చెప్పారట!
ఇంకేం! గౌతముడు నాసికా త్ర్యంబకానికి వెళ్ళి, ఓ కొండమీద ఒంటికాలి మీద తపస్సు చేశాడట! వెంటనే దక్షిణ గంగ గోముఖం నించి ధారగా వచ్చి, గౌతముణ్ణి దారి చూపించమందట—ఆయన వెనకాలే వచ్చేసిందట!
కానీ—గురవాడ వచ్చేటప్పటికి, ఓ పెద్ద కొండ గోడలా అడ్డం నిలబడి వుందట! ఇక సాగలేక అక్కడే ఆగిపోయిందట—దక్షిణ గంగ! మరి గౌతముడి పాతకం తొలగేదెలా?
అందుకని ఆ మహర్షి ఆ కొండని వుద్దేశించి, “ఓ పాపీ! దారి విడువు” అని ఆఙ్ఞాపించాడట! వెంటనే ఆ కొండ తలవొంచి, తన పాపిడి గుండా ప్రవాహాన్ని వెళ్ళమందట! ఆ ప్రవాహ వేగానికి ఆ కొండ రెండుగా చీలిపోయి, ఇప్పటి పాపికొండలు యేర్పడ్డాయట! (వీటిని పాపిడికొండలు అని కూడా అనేవారు!
సరే—దక్షిణగంగ పాపి కొండ అడ్డంకి దాటింది—కానీ, అక్కడ లోయ పల్లంగా వుండడం వల్ల అక్కడ నిలబడిపోయిందట!
అప్పుడు గౌతముడు తన దగ్గర వున్న—క్షేత్రాన్ని దున్నడానికి చేతి తో వుపయోగించే ‘పట్టిసం’ తో క్రిందికి మార్గం చేసాడు—దాంతో మళ్ళీ ప్రవహించి, గోష్పాద క్షెత్రాన్ని పావనం చేసి, గోవుని బ్రతికించింది! పట్టిసం తో మార్గం చేసిన చోటే ‘పట్టిస క్షేత్రం’. దాన్నే ఇప్పుడు పట్టి సీమ అంటున్నారు!
అక్కడ నించి, గౌతముడి విఙ్ఞప్తి మేరకు ఇతరులు కూడా కలిసి, ఆ గంగని సప్తర్షులూ యేడు పాయలుగా తీసుకెళ్ళి సముద్ర సంగమం చేయించారు! దాంతో ఈ ప్రాంతం సుభిక్షంగా మారింది!
తరవాత మహానుభావుడు ‘సర్ ఆర్థర్ కాటన్’ బ్యారేజి నిర్మించడం, ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా చెయ్యడం—జగద్విదితం!
అదీ సంగతి!
(కృష్ణమ్మ గురించి మరోసారి)

No comments: