Monday, January 26, 2009

మరో కుంభకోణం

“సత్యం—రామలింగ రాజం”


‘ఆడిటర్లు’; ‘ఫైనాన్షియల్ ఎనలిష్టులు’; ‘సెబి’; ‘విత్త మంత్రి’; ‘కార్పొరేట్ వ్యవహారాల మంత్రి’; రాష్ట్ర ముఖ్య మంత్రి’—వీళ్ళ మధ్య సంబంధాల గురించి నేను బ్లాగ్ సిద్ధం చేస్తూండగానే, నా సిస్టం లో సమస్య వచ్చి, ఇన్నాళ్ళూ వ్రాయలేక పోయాను.

ఈ మధ్య లోనే మరో కుంభకోణం బ్రద్దలయింది!

వివరాలు అందరికీ తెలిసినవే!

మహా ఘనుడు, తెలుగు తేజం, ‘ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే’ అని గర్వంగా చాటిన మన మాజీ ప్రథాని శ్రీ పీ. వీ. నరసిం హా రావు—ఆర్థిక సంస్కరణలని దేశంలో ప్రవేశ పెట్టక ముందు—కథ వేరుగా వుండేది!

బ్యాంకులు ఋణ మంజూరు పై నిషేధం విధించి, దాన్ని పొడిగిస్తూ, కొనసాగిస్తూ వుండేవి! (దీనికి కర్ణుడి చావులా—‘పూజారీ మేలాలూ’ ‘ఋణ మాఫీలూ’, ‘అస్థ వ్యస్థ ఋణ మంజూరీలు’—ఇలా అనేక కారణాలు!)

జాగ్రత్త చర్యలుగా ముందు ‘టాండన్ కమిటీ’ సిఫార్సులనీ, తరవాత ‘చోరే కమిటీ’ సిఫార్సుల్నీ అమలు చేశారు!
వీటి ముఖ్య లక్షణం యేమిటి అంటే, ఒక ‘యూనిట్’ కి ‘యెంతవరకూ ఒక బ్యాంకు ఋణం మంజూరు చెయ్యవచ్చు’ అనే దానికి రకరకాల వివరాలూ, వివరణలు అడిగి, వాటిని అనేక రకాలుగా విశ్లేషించి, ‘మాగ్జిమం పెర్మిసిబుల్ బ్యాంక్ ఫైనాన్స్’—‘ఎం. పీ. బి. ఎఫ్' అనే బ్రహ్మ పదార్ధాన్ని తయరు చేసి, ఏ పద్ధతిలో దీన్ని నిర్ణయించాలీ? అని ముందు నిర్ణయించి, అప్పుదు ఋణ మంజూరి జరిగేది.

సరిగ్గా ఈ విషయంలోనే, ‘చార్తర్డ్ ఎకౌంటెంట్’ ల, ఆడిటర్ల పంట పండింది!

మరి యూనిట్ కి యెంత ఋణం కావాలో చెపితే, దానికి తగ్గట్టు వాళ్ళ ‘ఫైనాన్షియల్ స్టేట్ మెంట్' లు దగ్గరనించీ, చెయ్యబోయే వ్యాపారంగురించీ, రాబోయే లాభాల గురించీ, దాంట్లో బ్యాంకుకి తీర్చబోయే బాకీలని తారీఖుల ప్రకారం యెంత ఖచ్చితంగా తీరుస్తారో, తీర్చగలరో—ఇలాంటి వివరాలన్నీ తయారు చెయ్యద్దూ?

సరే, తయారు చేసి, బ్యాంకుకి సమర్పించారనుకోండి, మరి వాటిలో మతలబులన్నీ సామాన్య బ్యాంకు ఉద్యోగులకి తెలియవు! కాబట్టి, బ్యాంకులు ‘ఫైనాన్షియల్ ఎనలిష్టులు’ అనే కొత్త పోస్టులని సృష్టించి, వాటిలో మల్లీ ‘చార్టర్డ్ ఎకౌంటెంట్’ లని నియమించడం ప్రారంభించేయి!

ఋణ మంజూరు అధికారికి ప్రతిపాదనలు పంపి, నెలల తరబడి వేచి చూసినా, ఎదో వంకతో ‘కొర్రీ’ల మీద ‘కొర్రీ’లు వేసేవారు!

“శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు” అన్నట్టు, సరిగ్గా అక్కడే యూనిట్ తరఫు ఆడిటర్లకి బ్యాంకు ఎనలిష్టులకీ అపసవ్య సంబంధాలు యేర్పడడం మొదలయ్యింది! కుంభాకోణాలకి బీజం పడింది! ‘యెలా అయితే మంజూరు అవుతుందో చెప్పెయ్యరాదా?’ అని వీళ్ళు అడగడం, ‘మేము చెప్పకూడదు గానీ, ఫలానా ఫలాన వాటిలో పొరపాట్లు వున్నాయి అని మాత్రం చెప్పగలం’ అని వీళ్ళు చెప్పడం మొదలయింది!

పోగా పోగా, కాగితాల మీద పరిస్థితి అంతా తేట తెల్లంగా వుండేదిగాని, బ్యాంకుల ఋణాలు వసూలు కాక పోయినా, ఋణ ఖాతాకి ఖర్చు వ్రాయగానే వడ్డీలని బ్యాంకు లాభాల ఖాతాలలొ చూపించడం, ప్రతీ సంవత్సరం బ్యాంకుల లాభాల్లో ఖచ్చితంగా వృద్ధి కనిపించడం జరిగేది!

తరవాత ‘నరసిం హం కమిటీ’ ముందుజాగ్రత్త నిబంధనలు (ప్రూడెన్షియల్ నార్మ్ స్) విధింపుకి సిఫార్సు చేసి, ప్రభుత్వం అమలు చెయ్యమనగానే, బ్యాంకుల బండారం బయటపడింది. ఆస్థులు (బ్యాంకులిచ్చిన అప్పులు) పారు బాకీలైనా, అలాగే పెరుగుతూ వుండడం వల్ల, వాటిని మినహాయిస్తే, పెట్టుబడులు నశించి, బ్యాలెన్స్ షీట్లు చిక్కిపోయాయి!

బ్యాంకులన్నిటికీ మళ్ళీ ప్రభుత్వమే నిధులు సరఫరా చెయ్య వలసి వచ్చింది (ప్రజలు కట్టే పన్నుల్లోంచి)!

మరి పైన చెప్పిన వాళ్ళ మధ్య సంబంధం లేదంటారా? అదే ఆడిటర్లూ, అధికార్లూ, మంత్రులూ, సెబి లాంటి వ్యవస్థలూ ఇప్పుడుకూడా యేదో రూపం లో వున్నాయి కదా—మరి మార్గం యేమిటి?

No comments: